మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం సాధ్యమైనంత సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రంజాన్ మాసం కేవలం పండుగ మాత్రమే కాకుండా విలువలను గుర్తుచేసే పవిత్రమైన సమయం అని ఆయన పేర్కొన్నారు. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహాయం చేస్తూ, అందరితో సత్సంబంధాలు కొనసాగించడమే రంజాన్ మాసం సందేశమని తెలిపారు.ఈ ఇఫ్తార్ విందులో మంత్రి మహ్మద్ అజారుద్దీన్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు మరియు మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
