మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలికి చెందిన రెడ్హిల్స్ జీఎం కుమార్పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మల్లాపూర్లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో నగదు, ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదును మెషీన్ల సహాయంతో లెక్కిస్తున్నారు.ప్రాథమికంగా రూ.1.10 కోట్ల నగదు, హైదరాబాద్లో 3 ఫ్లాట్లు, 6 ప్లాట్లు, నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ల వివరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న ఏసీబీ, ఆస్తుల మూలాలపై దర్యాప్తు కొనసాగిస్తోంది.
