మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి Amit Shah ప్రత్యేకంగా సత్కరించారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ కేంద్రం ప్రశంసలు తెలిపింది.తెలంగాణలో నక్సలిజాన్ని సమర్థవంతంగా అణచివేసి రాష్ట్రాన్ని శాంతి భద్రతల పరంగా ముందంజలో నిలిపినందుకు డీజీపీ CV Anand, మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతి తదితర అధికారులను అమిత్ షా సన్మానించారు.ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భద్రతా బలగాల సమన్వయం, రాష్ట్రాల సహకారం, స్పష్టమైన వ్యూహంతో ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. “ఒకప్పుడు నక్సలిజంతో తీవ్రంగా ప్రభావితమైన బస్తర్ ప్రాంతాన్ని ఇప్పుడు నక్సల్స్ రహితంగా ప్రకటించడం చారిత్రాత్మక ఘట్టం” అని అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా కొనసాగిన ఈ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందిని ఆయన స్మరించారు. తెలంగాణ పోలీసులు ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ ఆపరేషన్స్, సమన్వయ వ్యూహాలతో నక్సలిజం నిర్మూలనలో దేశానికి ఆదర్శంగా నిలిచారని కేంద్రం అభిప్రాయపడింది. కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
