మే 20, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో తీవ్ర వడగాలులు, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు మరియు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురైన వారికి వెంటనే వైద్యసాయం అందించాలని ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కలెక్టర్లకు అవసరమైన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
