మే 20, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఎస్ఏఎస్సీఐ పథకం కింద తెలంగాణకు అదనంగా రూ.5 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం మంజూరు చేయాలని భట్టి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధికి ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోందని ఆయన వివరించారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సహా పలు విద్యా ప్రాజెక్టులకు విదేశీ ఆర్థిక సహకారం పొందుతున్న నేపథ్యంలో, వాటికి ఎఫ్ఆర్బీఎమ్ పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిని భట్టి అభ్యర్థించారు.రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సహకారం అవసరమని, ముఖ్యంగా సంక్షేమం, విద్యా రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు సమాచారం.
