మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో ఇద్దరు వైద్యులు సైబర్ మోసగాళ్ల బారినపడ్డారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తులు పెట్టుబడుల పేరుతో భారీగా డబ్బులు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.‘జన్స్కార్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్’ పేరుతో సంప్రదించిన మోసగాళ్లు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టిస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ప్రారంభంలో ఖాతాల్లో కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్లు చూపించి బాధితుల విశ్వాసం పొందారు.అయితే డబ్బులు వెనక్కి తీసుకునే సమయంలో అదనపు చెల్లింపులు చేయాలని కోరడంతో వైద్యులకు అనుమానం వచ్చింది. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
