మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు రూ.4,500 కోట్ల విలువైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.రాష్ట్రంలో కూరగాయలతో పాటు మామిడి, పసుపు, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పంటలు కేవలం 6 శాతం సాగుభూమిలోనే పండుతున్నప్పటికీ, వ్యవసాయ స్థూల విలువలో వీటి వాటా 25 శాతంగా ఉండటం విశేషమన్నారు.ఉద్యాన పంటల విస్తరణకు బ్యాంకులు ప్రాధాన్యంగా రుణాలు అందించాలని తుమ్మల సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని దాదాపు 30 శాతం సాగుభూమిలో కౌలురైతులే వ్యవసాయం చేస్తున్నారని, వారికి కూడా సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత పంటలకు ప్రోత్సాహం కల్పిస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
