మే 25, (నేటి తెలుగు పత్రిక): సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించి వరి ధాన్యం కొనుగోలు పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. యూరియా సరఫరా, సాగునీరు, విద్యుత్ పంపిణీ, ధాన్యం కొనుగోలు వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులు ఎన్నడూ లేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. మొదట 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి, ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేయడం సరికాదన్నారు. మిగిలిన ధాన్యాన్ని రైతులు ఏం చేయాలనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటివరకు కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి Revanth Reddy ప్రకటించిన “మిషన్ మోడ్” ధాన్యం కొనుగోలు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అది “మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్” అంటూ హరీశ్ రావు విమర్శించారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
