Breaking News

అమరావతిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి: గొట్టిపాటి రవి కుమార్

మే 25, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈదురుగాలుల కారణంగా చెట్లు, భారీ హోర్డింగ్‌లు విద్యుత్ స్తంభాలపై పడటంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు.దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అత్యవసరంగా మరమ్మతు చేసి, వీలైనంత త్వరగా సరఫరా పునరుద్ధరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు.పునరుద్ధరణ పనుల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెగిపోయిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లొద్దని, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. పలుచోట్ల 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

డ్వాక్రా మహిళలకు శుభవార్త.. షూరిటీ లేకుండానే రూ.10 లక్షల రుణం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *