మే 25, (నేటి తెలుగు పత్రిక): మావోయిస్టు నాయకుడు కట్టా రామచంద్రారెడ్డి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడవుల్లో జరిగే యాంటీ నక్సల్ ఆపరేషన్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సాగుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.న్యాయమూర్తులు సతీశ్ చంద్ర శర్మ, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కరుడుగట్టిన నక్సలైట్లను పుష్పగుచ్ఛాలతో స్వాగతించలేమని, భద్రతా బలగాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తాయని పేర్కొంది. ఆపరేషన్ సమయంలో రామచంద్రారెడ్డి వద్ద నుంచి ఆధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు గుర్తుచేసింది.గత ఏడాది ఛత్తీస్గఢ్లో జరిగిన యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి మృతి చెందారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలన్న అభ్యర్థనను ఇప్పటికే ఛత్తీస్గఢ్ హైకోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శరీరంపై గాయాల ఆధారంగా కస్టడీలో హింస జరిగిందని వాదించారు. అయితే ఎన్కౌంటర్ సమయంలో పెనుగులాటలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ గాయాలను కస్టడీ మరణానికి నిదర్శనంగా భావించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ కేసులో రీ-పోస్టుమార్టం అవసరం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేసింది.
