జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వర్షాలకు తడిసిన ధాన్యానికీ కనీస మద్దతు ధర చెల్లిస్తామని స్పష్టం చేశారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలంగాణకు ఇవ్వడం లేదని విమర్శించారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరిన ఆయన, ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను కూడా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పారు. గూడాలు, తండాల్లో గుడిసెలు లేకుండా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

