గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
హైదరాబాద్: నగరంలోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వద్ద ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయిలో ఆధునిక వైద్య సదుపాయాలతో 26.30 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.
ఆధునిక హంగులతో వైద్య సేవలు
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గోషామహల్ స్టేడియంలో అత్యాధునిక హంగులతో ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టింది. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక సదుపాయాలు
- గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి.
- పేషంట్ల అటెండెండ్ల కోసం ఆసుపత్రి ఆవరణలోనే ధర్మశాల ఏర్పాటు చేయనున్నారు.
- ఆసుపత్రిలో ఆధునిక లాబ్లు, ఐసీయూ వార్డులు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ వంటి అత్యాధునిక సదుపాయాలను అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంత కుమారి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఉస్మానియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
