నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. వరుస ఘటనల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. రాజకీయాలను నేరాల వైపు నడిపిన సంస్కృతి వైసీపీదేనని విమర్శించారు. వైసీపీ పాలనంతా చట్టరహితంగా కొనసాగిందని, అలాంటి పరిస్థితులకు 2024 ఎన్నికలతో ప్రజలు ముగింపు పలికారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ రూల్ ఆఫ్ లా అమలులోకి వచ్చిందని తెలిపారు.
ప్రజల సాధికారతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ గతంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, అందుకే ఆ పార్టీ నిరాశ, అసహనంతో వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చూసి వైసీపీ తట్టుకోలేకపోతున్నదని ట్వీట్లో విమర్శించారు.శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిబంధనలు అందరికీ ఒకటేనని తెలిపారు. హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

