గనుల కారిడార్లు, 2 హైటెక్ టెక్నాలజీ హబ్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పించడం గమనార్హం. రాష్ట్రపతి ఆమోదం, కేంద్ర మంత్రివర్గ ఆమోదం అనంతరం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా దేశీయ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత్ ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.ఎగుమతులపై ఆధారాన్ని తగ్గించుకుంటూ అంతర్గత వృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. సంస్కరణల అమలుతో 7 శాతం వృద్ధిరేటును సాధించామని, ఉపాధి అవకాశాల పెంపే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విధానాలు అమలు చేస్తూ బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా అడుగులు వేస్తామని వెల్లడించారు.
బడ్జెట్లో కీలక ప్రకటనలు:
- బయో ఫార్మా రంగ అభివృద్ధికి రూ.10,000 కోట్ల కేటాయింపు
- ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్ల ఏర్పాటు
- మూడు ప్రత్యేక కెమికల్ పార్కులు
- ప్రస్తుత NIPER సంస్థల ఆధునీకరణ
- దేశంలో 2 అత్యాధునిక హైటెక్ టెక్నాలజీ హబ్స్ ఏర్పాటు
ఈ బడ్జెట్ రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధికి, యువతకు ఉద్యోగ అవకాశాల సృష్టికి కీలకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

