నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయన భార్య ఉపాసన శనివారం రాత్రి పండంటి కవలలకు జన్మనిచ్చింది. బాబు, పాప పుట్టడంతో మెగా కుటుంబంలో డబుల్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే ఈ ఆనంద సమయంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు చర్చకు దారి తీసింది. రామ్ చరణ్ తన భార్య ఉపాసనను, నవజాత శిశువులను చూడటానికి పెద్ద కుమార్తె క్లింకారాతో కలిసి హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన కారు ఆసుపత్రి వద్దకు రాగానే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకొని సెల్ఫీలు అంటూ హడావిడి చేశారు.
చరణ్ కారు దిగేలోపే అభిమానులు చుట్టుముట్టడంతో పరిస్థితి కొంత అసౌకర్యంగా మారింది. చేతుల్లో చిన్నారి క్లింకారా ఉండటంతో భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. అభిమానుల గుంపు చూసి క్లింకారా భయపడినట్లు కనిపించగా, రామ్ చరణ్ కూడా కాస్త అసహనంగా స్పందించినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానమంటే అభిమానమే కానీ, సెలబ్రిటీల వ్యక్తిగత క్షణాలకు, కుటుంబ భద్రతకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

