నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: చైనాతో సరిహద్దు వివాదంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా డోక్లాం అంశాన్ని రాహుల్ ప్రస్తావించడంతో బీజేపీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.బీజేపీ నేతల నినాదాల నడుమ రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లేచి నిలబడి నిరసన తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంలో లేని అంశాలను చర్చించడం సభ నియమాలకు విరుద్ధమని వారు స్పష్టం చేశారు.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే చైనా–డోక్లాం వివాదంపై రాసిన పుస్తకాన్ని రాహుల్ ప్రస్తావించడాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుపట్టింది. ఆ పుస్తకం ఇప్పటివరకు ప్రచురించలేదని, ప్రచురణకు అనుమతి కూడా ఇవ్వలేదని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అలాంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని పార్లమెంటులో మాట్లాడటం సరికాదని అన్నారుఈ వ్యవహారంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా జోక్యం చేసుకుని, సభ నియమాలు ఉల్లంఘిస్తున్నారని రాహుల్ను హెచ్చరించారు. దేశం, సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయవద్దని అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు.ఈ సమయంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ రాహుల్కు మద్దతుగా మాట్లాడారు. పుస్తకం గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరినా, స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. అనంతరం సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

