నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనలను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు సాగుతున్నాయంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.వైసీపీ వ్యాఖ్యలపై టీడీపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. పార్టీ కార్యకర్తలు భావోద్వేగాలకు లోనవుతుండటంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ మంత్రులు, కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.
అధికారం కోల్పోయిన నిరాశతోనే వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదని స్పష్టం చేశారు. వైసీపీ వేసే రాజకీయ ఉచ్చుల్లో పడవద్దని టీడీపీ నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు.ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణేనని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ లక్ష్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చట్టం ఉల్లంఘించిన వారెవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు.అదే సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. హింసాత్మక ఘటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడవద్దని ఆయన సూచించారు. ఏ సమస్య వచ్చినా చట్టబద్ధ మార్గాల్లోనే పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన వేళ, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రత్యర్థి పార్టీలు ఇటువంటి ఘటనలను ప్రోత్సహిస్తున్నాయని పల్లా ఆరోపించారు. ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడేలా పార్టీ కేడర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

