నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఏర్పడుతున్న రద్దీకి చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 2,500 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ ఎన్టీ కృష్ణబాబు వెల్లడించారు.సోమవారం ఆర్టీసీ హౌస్లో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణబాబు.. అనంతరం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న బస్సుల్లోని ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గనుందని ఆయన తెలిపారు.
పీఎం ఈ-బస్ పథకంతో బలం
పీఎం ఈ-బస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ఏపీకి కేటాయించినట్లు కృష్ణబాబు తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా 1,450 ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ విధంగా మొత్తం 2,500 కొత్త బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లో చేరనున్నాయి.
మహిళలకు పెద్ద ఊరట
స్త్రీ శక్తి పథకం అమలుతో మహిళల సంఖ్య బస్సుల్లో భారీగా పెరిగింది. దీంతో సీట్లు దొరకక ఇబ్బందులు, వాగ్వాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. కొత్త బస్సుల రాకతో మహిళలు ఉచిత ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా పొందడమే కాకుండా, మిగతా ప్రయాణికులకూ సరైన సీట్లు లభించనున్నాయి.
ఈ ఏడాదే రోడ్డెక్కనున్న బస్సులు
ఈ ఏడాది చివరికల్లా కేంద్రం అందించే ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులు రోడ్డెక్కే అవకాశముందని అధికారులు తెలిపారు. పాతబడ్డ, తరచూ మొరాయించే బస్సులను తొలగించి ఆధునిక బస్సులను ప్రవేశపెట్టనున్నారు.ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యమని కొత్త ఎండీ కృష్ణబాబు స్పష్టం చేశారు.

