జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనసేన పార్టీలో నేతల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీపై, నాయకత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అడ్డుకోకుండా మౌనంగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “పార్టీ కోసం మాట్లాడకపోతే పదవుల ఏమిటి?” అంటూ నేతలను నిలదీశారు.జనరల్ బాడీ సమావేశంలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. అసత్య ఆరోపణలు జరుగుతున్నప్పుడు స్పందించకపోవడం పార్టీకి నష్టం కలిగిస్తుందన్నారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీ వాదనను బలంగా వినిపించాల్సిన బాధ్యత ప్రతి నేతపై ఉందని చెప్పారు.పార్టీలో ఎవరు క్రియాశీలంగా ఉన్నారు, ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న పూర్తి సమాచారం తన దగ్గర ఉందని పవన్ స్పష్టం చేశారు. ఇకపై పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ లేదని తేల్చిచెప్పారు.వైసీపీ నేతల వ్యాఖ్యలకు రాజకీయంగానే సమాధానం ఇవ్వాలని పవన్ సూచించారు. ఘటనలపై మాత్రమే కాకుండా, వాటికి దారితీసిన పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకురావాలని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ లక్ష్యాల కోసం పని చేసే వారికే జనసేనలో భవిష్యత్ ఉంటుందన్నారు.
అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణకు కమిటీని నియమించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయనుండగా, PAC పునరుద్ధరణతో పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.మరోవైపు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించి, మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రక్రియ పూర్తిచేయాలని పార్టీ నిర్ణయించింది.

