నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తప్పు చేసినవారు ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్పై పరోక్ష విమర్శలు చేసిన ఆయన.. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.హైదరాబాద్లో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార కార్యక్రమంలో మాట్లాడుతూ, నోటీసులు ఇస్తేనే జాతిపిత అవమానమైందని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. ఎవరి ఇళ్ల తలుపులు బద్దలు కొట్టలేదని, చట్టబద్ధంగానే విచారణ జరుగుతోందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఏకం చేసిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని సీఎం ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేసినప్పుడు ఉద్యమకారుల గుర్తు రాలేదా అని బీఆర్ఎస్ను నిలదీశారు. అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యంలో విచారణ తప్పదని అన్నారు.రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఇవ్వడం సరైన నిర్ణయమని సీఎం తెలిపారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డికి తగిన గౌరవం కల్పిస్తామని చెప్పారు.రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని అన్నారు.

