పులివెందుల ఫిబ్రవరి 3 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో గల రాజారెడ్డి కాలనీలో పరిధిలో నూతన దేవాలయానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తుగుట్ల మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలే కాకుండా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. దేవాలయాల నిర్మాణంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తుల మనసుల్లో శాంతి, భక్తి భావనలు పెంపొందుతాయని ఆ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి చొరవ చూపుతున్న ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, లోక్ నాథ్ రెడ్డి, త్రిలోకనాథ్ రెడ్డి, కుమారు, రంగస్వామి, శివ, సూరి, స్థానికులు పాల్గొన్నారు.

