- నిధుల మంజూరుకు ప్రత్యేకంగా చొరవ తీసుకోండి.
- ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎన్.టి.ఆర్. జిల్లా తరఫున వినతి పత్రం అందజేత.
విజయవాడ, నేటి తెలుగు పత్రిక: ఈ నెల 14న ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్దంగా అందాల్సిన బకాయిలపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎన్.టి.ఆర్. జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరా రాజగోపాల్ (తాతయ్య)ను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వం “బాకీకి భూమి” ప్రతిపాదనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సి.పి.ఎస్. రద్దు చేసి ఓ.పి.ఎస్. పునరుద్ధరించాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలన్నారు. తాము అధికారంలోకి వస్తే సి.పి.ఎస్. / జి.పి.ఎస్.లను సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం ఒక సంవత్సర కాలంలో చూపుతామన్న అధికార పక్ష పార్టీల ఎన్నికల హామీని ప్రస్తుత శాసనసభ / శాసన మండలి వేదికగా 2026- 2027 ఆర్థిక సంవత్సరానికి చేసే బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.కిశోర్ కుమార్, ఇబ్రహీం, బ్రహ్మేశ్వరరావు, శోభన్బాబు, పి.వి.రామారావు, మహిళా విభాగం రాష్ట్ర కోశాధికారి కె.ఇందిరా దేవి, ఎన్.టి.ఆర్. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వై.రేణుక, వైస్ ప్రెసిడెంట్ సి.హెచ్. సుధా శ్రీనివాస్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

