తెనాలి, ఫిబ్రవరి 3 (నేటి తెలుగు దిన పత్రిక ప్రతినిధి): రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారుతో కలిసి తెనాలి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, ల్యాబ్లను పరిశీలించి, అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల స్థితిగతులను సమగ్రంగా పర్యవేక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి వర్యులు నేరుగా మమేకమై మాట్లాడుతూ, వారికి అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల లబ్ధి, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మరింత నాణ్యమైన, సానుకూల వైద్య సేవలు అందేలా నిరంతరం మెరుగుదలలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సూచించారు.అనంతరం ఇటీవల మంజూరైన నూతన ట్రామా సెంటర్కు సంబంధించిన స్థలాన్ని సందర్శించి, ప్రతిపాదిత పనులపై అధికారులతో చర్చించారు. తెనాలి ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ఈ ట్రామా సెంటర్ కీలకంగా మారనుందని పేర్కొంటూ, ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వర్యులు స్పష్టం చేశారు. సాధారణ ప్రసవాలు చేయడంలో తోడ్పాటును అంగించిన మిడ్ వైఫరీ సిబ్బందిని మంత్రి అభినందించారు.వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల నాయుడు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.రంగారావు తదితరులు పాల్గొన్నారు.


