నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఆధార్ స్పెషల్ క్యాంపుల ద్వారా విద్యార్థులు ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో ఈ క్యాంపులు నిర్వహించనుండగా, విద్యార్థులు బయోమెట్రిక్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం ఎలాంటి ఫీజు లేకుండానే సరిచేసుకోవచ్చు. సాధారణంగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లలో అప్డేట్ చేయాలంటే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఈ క్యాంపుల్లో మాత్రం అన్ని సేవలు పూర్తిగా ఉచితం.
ఫిబ్రవరిలో క్యాంపుల షెడ్యూల్ ఇదే.
ఫిబ్రవరి నెలలో రెండు దశలుగా ఈ స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
- ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు
- ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు
ఈ రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే ఆధార్ అప్డేట్ అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎందుకు అవసరం అంటే..?
చిన్న వయస్సులో ఆధార్ తీసుకున్న పిల్లల బయోమెట్రిక్ వివరాలు పెద్దయ్యాక పనిచేయవు. అందుకే 5 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాల్సిందే అని UIDAI ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ వయస్సు వారికీ ఆధార్ అప్డేట్ పూర్తిగా ఉచితం.
అప్డేట్ చేయించకపోతే సమస్యలు..?
ఆధార్ వివరాలు అప్డేట్ కాకపోతే:
- ప్రభుత్వ పథకాలు నిలిచిపోయే ప్రమాదం
- స్కాలర్షిప్లు, ఇతర లబ్ధుల్లో ఇబ్బందులు
వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంపులు కొనసాగుతున్నాయి. అయినా ఇంకా చాలా మంది విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేయించుకోకపోవడంతో ప్రభుత్వం ప్రతీ నెలా క్యాంపులు నిర్వహిస్తోంది. ఇదే తరహాలో తెలంగాణలో కూడా విద్యాసంస్థల్లో స్పెషల్ ఆధార్ క్యాంపులు అమలు చేస్తున్నారు.
తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

