రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్ స్టేషన్లు.. దూర ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యం.
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సదుపాయాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో కొత్త బస్ స్టేషన్లు, డిపోలు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు శరవేగంగా సాగుతుండగా.. మరికొన్ని ప్రాజెక్టులు టెండర్ల దశలో ఉన్నాయి. కొత్త బస్టాండ్లతో ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేని పలు ప్రాంతాలకు త్వరలోనే ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
శరవేగంగా బస్ డిపోల నిర్మాణం
రాష్ట్రంలో దూరప్రాంతాలు, పర్యాటక కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ కొత్త డిపోల నిర్మాణంపై దృష్టి పెట్టింది.పెద్దపల్లిలో రూ.11.01 కోట్లతో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత భవనాలను తొలగించి ఆధునిక సదుపాయాలతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యార్డు లెవలింగ్ పనులు జరుగుతున్నాయి.అలాగే ఏటూరు నాగారంలో 3.79 ఎకరాల విస్తీర్ణంలో రూ.5.91 కోట్లతో కొత్త బస్ డిపో నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్లోగా ఈ డిపోను ప్రారంభించాలనే లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించారు. ఈ డిపో ప్రారంభంతో బొగత జలపాతం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, ఏటూరు నాగారం వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన బస్సు సౌకర్యం లభించనుంది.
కొత్త బస్ స్టేషన్లు ఎక్కడంటే..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కొత్త బస్ స్టేషన్లు నిర్మించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.
కొత్త బస్ స్టేషన్లు నిర్మించనున్న ప్రాంతాలు:
- నిజామాబాద్
- వేములవాడ
- నాగర్ కర్నూల్
- హుజూర్ నగర్
- కోదాడ
- మంథని
- ములుగు
- కాళేశ్వరం
- మధిర
- మహబూబ్ నగర్
- గంగాధర
- రేగొండ
- మాడ్గుల
ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్లు
- అత్యాధునిక సౌకర్యాలతో కొత్త బస్టాండ్ల నిర్మాణం
- కోదాడ బస్ స్టేషన్ను రూ.16.89 కోట్లతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పాటు
- మరో 7 కొత్త బస్ స్టేషన్లు ప్రస్తుతం టెండర్ల దశలో
- కొత్త బస్టాండ్లతో అన్ని జిల్లాలు, పట్టణాలకు మెరుగైన బస్సు సౌకర్యం
కొత్త బస్ స్టేషన్లు, డిపోల నిర్మాణంతో తెలంగాణలో ప్రజా రవాణా మరింత బలోపేతం కానుంది. దూర ప్రాంతాల ప్రజలకు సైతం ఆర్టీసీ సేవలు చేరువకానున్నాయని అధికారులు చెబుతున్నారు.

