బీజేపీకి బూస్ట్.. కాంగ్రెస్కు టెన్షన్..?
నేటి తెలుగు పత్రిక :తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పీక్స్కు చేరుతోంది. అధికార–విపక్షాలు ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తుండగా ఇప్పుడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్ రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తోంది. బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనుండటంతో కాంగ్రెస్–జనసేన మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా ముదిరింది.ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుతో పాటు, జనసేన తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పవన్ ప్రచార రంగంలోకి దిగనున్నారు. నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వారి కోసం కూడా పవన్ ప్రచారం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో తెలంగాణ జనసేన శ్రేణులు ఫుల్ ఖుష్లో ఉన్నాయి. మరోవైపు బీజేపీ కూడా పవన్ ఎంట్రీని పెద్ద ప్లస్గా భావిస్తోంది.అయితే పవన్ తెలంగాణ పర్యటనపై అధికార కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. తెలంగాణలో జనసేనకు ఎలాంటి స్థానం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ భాష, సంస్కృతిపై పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ… ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఘాటుగా విమర్శించారు. “పవన్ ఆంధ్రా రాజకీయాలకే పరిమితం కావాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలకు జనసేన నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. “కాంగ్రెస్ కేవలం తెలంగాణ పార్టీయేనా? బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణకే పరిమితమా?” అంటూ జనసేన అధికారికంగా సోషల్ మీడియాలో ఘాటు సమాధానం ఇచ్చింది. జనసేన ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పార్టీ కాదని, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.ఇదే కాక, జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ కూడా కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్కు ఉన్న “గోల్డెన్ లెగ్” చూసే కాంగ్రెస్కు భయం పట్టుకుందన్నారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ విజయం సాధించిందని గుర్తు చేస్తూ తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందనే భయంతోనే కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు.ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఆయన అడుగుపెట్టేలోపే ఈ స్థాయిలో రాజకీయ రచ్చ నడుస్తుండటంతో పవన్ ప్రచారం తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్న ఆసక్తి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

