అరుదైన భూమి లోహాల గుర్తింపుతో ఆసియా శక్తి సమీకరణాల్లో సంచలనం.
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జపాన్–చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో జపాన్కు ఊహించని శుభవార్త లభించింది. పసిఫిక్ మహాసముద్రం అతి లోతుల్లో భారీ స్థాయిలో అరుదైన భూమి ఖనిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోనే తొలిసారి ఇంత లోతులో ఈ ఖనిజాలను గుర్తించి వెలికితీయడంలో జపాన్ కీలక విజయం సాధించినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.నెల రోజుల క్రితం జపాన్ అత్యాధునిక పరిశోధనా నౌకను సముద్రంలోకి పంపింది. ఈ నౌక పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 6,000 మీటర్ల లోతులో అరుదైన భూమి ఖనిజాల అవక్షేపాలను గుర్తించింది. ఫిబ్రవరి 2న ఈ అవక్షేపాల్లో విలువైన అరుదైన లోహాలు ఉన్నట్లు జపాన్ అధికారికంగా ప్రకటించింది. సముద్రం కింద ఇంత లోతులో ఈ ఖనిజాలను వెలికితీసే ప్రక్రియ ప్రపంచంలోనే తొలిసారి జరగడం విశేషంగా మారింది.మినామి టోరిషిమా ద్వీపానికి సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ (EEZ) పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో భారీగా అరుదైన భూమి మూలకాలు ఉన్నాయన్న అనుమానం చాలాకాలంగా ఉంది. ఇప్పుడు దానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లభించాయి. ఈ ఆపరేషన్ను జపాన్కు చెందిన అత్యాధునిక డీప్-సీ డ్రిల్లింగ్ నౌక ‘చిక్యు’ విజయవంతంగా నిర్వహించింది.
ఈ కనుగొనికను జపాన్ ప్రభుత్వం ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వాతంత్ర్యం దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం అరుదైన భూమి ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్లో చైనా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే జపాన్కు లభించిన ఈ కొత్త ఖనిజ సంపదతో ఆ ఆధారపడటం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అరుదైన భూమి మూలకాలు మొత్తం 17 రకాల లోహాలు. ఇవి లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, విండ్ టర్బైన్లు, హార్డ్ డిస్క్లు, లేజర్ టెక్నాలజీతో పాటు క్షిపణులు, రక్షణ పరికరాల తయారీ అసాధ్యం. ఈ నేపథ్యంలో జపాన్కు లభించిన ఈ ఖనిజ వనరులు ఆసియాలోనే కాదు, ప్రపంచ స్థాయిలో శక్తి సమీకరణాలను మార్చే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

