నవోదయం 2.0 కింద నిరంతర నిఘా.
అమరావతి, ఫిబ్రవరి 5 నేటి తెలుగు పత్రిక: నవోదయం 2.0 కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ను అక్రమ మద్యం తయారీ (ఇలిసిట్ డిస్టిలేషన్) రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎక్సైజ్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్రమ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం, భద్రతకు కలిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని 2025 ఫిబ్రవరిలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించామని, సమన్వయంతో కూడిన కఠిన చర్యల ఫలితంగా 2025 డిసెంబర్ నాటికి రాష్ట్రం ఐడీ రహితంగా నిలిచిందని మంత్రి చెప్పారు. అయితే ఇదే స్థాయిలో నిరంతర నిఘా కొనసాగించాల్సిన అవసరం ఉందని, అలవాటు పడిన నేరస్తులను పునరావాసం ద్వారా మళ్లీ నేరాల వైపు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎక్సైజ్ శాఖ ఆదాయ పనితీరును సమీక్షించిన మంత్రి, ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఆదాయం కంటే ప్రజా సంక్షేమమేనని స్పష్టం చేశారు. ఎక్సైజ్ పాలసీ 2025–28 కింద బార్ల కేటాయింపులపై స్పందిస్తూ, ఓపెన్ కేటగిరీలో 840 బార్లు, గీతా కులాలకు 84 బార్లు నోటిఫై చేసినట్లు తెలిపారు. 2025 ఆగస్టు, సెప్టెంబర్లో జరిగిన తొలి రెండు దశల్లో 625 బార్లు కేటాయించగా, గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మూడో దశ డ్రాలో 194 బార్లు కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన 107 బార్లను త్వరలోనే మళ్లీ నోటిఫై చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అబ్కారీ, గనుల శాఖముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ఎక్సైజ్ , ప్రొహిబిషన్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్, అదనపు కమిషనర్ ఎం. దేవకుమార్, ఏపీఎస్బీసీఎల్ జనరల్ మేనేజర్ అనసూయ దేవి తదితరులు పాల్గొన్నారు.
