రూట్ మ్యాప్పై టెన్షన్.. ఏ దారిన వెళ్తారన్నదే ఉత్కంఠ.
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన తర్వాత ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం.. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో మరింత ఆసక్తికరంగా మారింది. దాడిలో నష్టం చవిచూసిన జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఇటీవల అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి పరామర్శించిన జగన్.. ఇప్పుడు అదే తరహాలో జోగి రమేష్ ఇంటికి వెళ్లనున్నారు. టీడీపీ అనుచరుల దాడిలో జోగి రమేష్ ఇల్లు ధ్వంసం కావడం, ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండటంతో ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ దాడిని ఖండించిన జగన్, స్వయంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ జగన్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ను విడుదల చేసింది. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కనకదుర్గ వారధి, బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని పార్టీ నేతలు ప్లాన్ చేశారు. అయితే ఈ రూట్ను పోలీసులు అంగీకరించడం లేదు.ఇటీవలి పరామర్శల సమయంలో భారీగా జనం తరలివస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. వైసీపీ సూచించిన మార్గాల్లో ఇరుకైన ప్రాంతాలు ఉండటంతో తొక్కిసలాట ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో పోలీసులు ప్రత్యామ్నాయ రూట్ను సూచిస్తూ జగన్కు నోటీసులు జారీ చేశారు.
పోలీసుల సూచన ప్రకారం తాడేపల్లి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట, గుంటుపల్లి, తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నం వెళ్లాలని సూచించారు. కనకదుర్గ వారధి మీదుగా వెళ్లవద్దని స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జన సమీకరణ చేయొద్దంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఇటీవల గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వెళ్లే సమయంలో తక్కువ దూర పర్యటన కూడా గంటల కొద్దీ సాగి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన విషయాన్ని పోలీసులు గుర్తుచేశారు. అందుకే ఈసారి విజయవాడ సిటీ లోపలికి వెళ్లకుండా వెస్ట్ బైపాస్ ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నారు.ఇక మరికాసేపట్లో ప్రారంభం కానున్న జగన్ పర్యటన ఏ రూట్లో సాగుతుందన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నిర్ణయమా..? పోలీసుల ఆదేశాలే ఫైనల్ అవుతాయా..? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
