డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.
నేటి తెలుగు పత్రిక : నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాయుడుపేట సమీపంలోని విన్నమాల వద్ద ఈ ఘటన జరిగింది.బస్సు వెనుక భాగం నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన స్థానిక వాహనదారులు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపి, అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను క్షణాల్లో కిందకు దించేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అయితే మంటల వల్ల బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమికంగా బ్యాటరీ వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించారు.
