పవన్ ఎంట్రీతో రాజకీయ సమీకరణలు మారనున్నాయా..?
నేటి తెలుగు పత్రిక: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పోరులోకి జనసేన పార్టీ అడుగుపెట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను బరిలోకి దింపిన జనసేన.. ఇప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారానికి సిద్ధం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ రాజకీయాల్లో తనదైన ప్రభావం చూపిన జనసేన.. తెలంగాణలోనూ పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణలో పర్యటించి జనసేన అభ్యర్థులతో పాటు మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు పవన్ను కలిసి అధికారికంగా ఆహ్వానించడం గమనార్హం.పవన్ పర్యటనకు ముందే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేతలు ఆయన తెలంగాణపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ బలంపై సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి.
ఇదిలా ఉండగా.. పవన్ తెలంగాణలోకి రావడం కొత్త విషయం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలోనూ ఆయన పర్యటనలు, కార్యక్రమాలు ఉన్నప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రత్యక్ష ప్రచారం చేయడం మాత్రం ఈసారి ప్రత్యేకతగా మారింది.
మరి పవన్ కళ్యాణ్ ప్రచారం ఎవరికెంత లాభం చేకూరుస్తుంది..?
అధికార పార్టీకి ఇది సవాలుగా మారుతుందా..?
లేదా బీజేపీ–జనసేనకు బలంగా నిలుస్తుందా..?
ఈ ప్రశ్నలకు సమాధానం ఓటర్ల తీర్పుతో త్వరలోనే తేలనుంది.
