డ్రోన్లు, 4G కెమెరాలు, రెస్క్యూ టీమ్లతో అటవీ శాఖ కట్టుదిట్టమైన చర్యలు.
నేటి తెలుగు పత్రిక: రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తోంది. ఆకలితో ఉన్న పులి గ్రామాల సమీపంలో తిరుగుతుండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గురువారం పలు ప్రాంతాల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో అటవీ శాఖ గస్తీ మరింత కఠినం చేసింది.పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 4G ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లు, పిటిజడ్ కెమెరాలతో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి కనిపించిన క్షణాల్లోనే లొకేషన్, ఫొటోలు నేరుగా అధికారుల మొబైల్కి చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేశారు.
రాత్రి వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పులి సంచరిస్తోందని భావిస్తున్న ప్రాంతాల్లో భద్రత మరింత పెంచారు. మొత్తం 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల కదలికలను చిప్లో రికార్డ్ చేస్తున్నారు. ఇక పులి రెస్క్యూకు రాజమండ్రి చేరుకున్న నిపుణుల బృందం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. 2007 నుంచి దేశవ్యాప్తంగా వన్యప్రాణి సంరక్షణలో అనుభవం ఉన్న ఈ టీమ్ ఇప్పటివరకు వేలాది జంతువులకు చికిత్స చేసి సహజవాసాలకు చేర్చింది. అవసరమైతే మత్తు ఇంజెక్షన్ ద్వారా పులిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
రెస్క్యూ బృందం, అటవీ అధికారులు సమన్వయంతో పని చేస్తుండగా.. పులి పట్టుబడే వరకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
