మహిళ అడిగిన సాయానికి క్షణాల్లో స్పందించిన జగ్గారెడ్డి.
నేటి తెలుగు పత్రిక: సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రచారం మధ్యలో రోడ్డుపక్కన నిమ్మసోడా అమ్ముతున్న మహిళ బండి దగ్గర ఆగిన ఆయన కేవలం సోడా తాగడమే కాదు, ఆమె జీవితాన్ని మార్చే సాయం కూడా చేశారు.నిమ్మసోడా తాగుతూ ఆ మహిళతో ముచ్చటించిన జగ్గారెడ్డి వ్యాపారం ఎలా సాగుతోందని అడిగారు. కొత్త సోడా మెషిన్ ఉంటే ఆదాయం పెరుగుతుందని, ప్రస్తుతం మాత్రం కష్టంగా నడుస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మెషిన్ కోసం ఎంత ఖర్చవుతుందని అడగగా లక్ష రూపాయలు పెట్టాల్సి వస్తుందని చెప్పింది.అంతే ఇంకేమీ ఆలస్యం చేయకుండా జేబులోంచి లక్ష రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టిన జగ్గారెడ్డి“ఎండాకాలం వచ్చేసరికి మెషిన్ కొనుక్కో రోజుకు మూడు వేలైనా సంపాదించాలి. బాగా బతకాలమ్మా” అంటూ ధైర్యం చెప్పారు.అప్పటికప్పుడు లక్ష రూపాయలు అందుతాయని ఊహించని ఆ మహిళ ఒక్కసారిగా షాక్కు గురైంది. భావోద్వేగంతో జగ్గారెడ్డికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన అక్కడున్న వారిని కూడా భావోద్వేగానికి గురిచేసింది.ఎన్నికల ప్రచారం మాటలకే పరిమితం కాకుండా అవసరంలో ఉన్నవారికి చేతిచాచే నాయకత్వం ఇదంటూ జగ్గారెడ్డి చర్యకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
