పులివెందుల ఫిబ్రవరి 6,(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పేద ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గవ్యాప్తంగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 56 మంది లబ్ధిదారులకు మంజూరైన మొత్తం 32 లక్షల 86 వేల 873 రూపాయల విలువైన చెక్కులను ఆమె స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆపద సమయంలో ఆర్థికంగా ఆదుకుని, మెరుగైన వైద్యం కోసం సాయం అందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డిమాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
