పులివెందుల ఫిబ్రవరి 9 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వేంపల్లి – చాగలమర్రి రహదారి విస్తరణకు మోక్షం ఎప్పుడు అని రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ప్రశ్నించారు. సోమవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వేంపల్లి – వీరపునాయుని పల్లి- ఎర్రగుంట్ల- ప్రొద్దుటూరు- కొర్రపాడు- రాజుపాలెం — చాగలమర్రి రోడ్డు విస్తరణ పనులు మంజూరై దాదాపు రెండు సంవత్సరాలు అయింది అన్నారు. దీని పొడవు 79 కిలోమీటర్లు అంచనా 1321 కోట్ల రూపాయలు. టెండర్లు కూడా అయిపోయాయి. ఎన్ ఎస్ పి ఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెండర్ దక్కించుకుంది రెండేళ్లయినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. దీనికి కారణం భూసేకరణ కార్యక్రమం పూర్తి కాలేదు.ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా భూసేకరణ పూర్తి చేయాలని, రహదారి విస్తరణ పనులు ప్రారంభించాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కరెంటు మీటర్ రీడర్లు
రాష్ట్రంలో మూడు డిస్కముల పరిధిలో దాదాపు నాలుగు వేల మంది మీటర్ రీడర్లు ఉన్నారు.గత 15 సంవత్సరాలుగా వీరు పని చేయుచున్నారు నామమాత్రపు వేతనముతో పని చేయుచున్నారు. దురదృష్టవశాత్తు అదాని స్మార్ట్ మీటర్ల వల్ల వీరందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితి దాపురించింది. వీళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి.వీరిని కొనసాగించడం లేదా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం ఏదో ఒకటి చేయాలని తులసి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రసాద్ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి,వేంపల్లి మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి,ఉత్తన్న తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బండారు వెంకటేశు చినకోట్ల నాగరాజు,ఐచర్ రమణ, నామా వినయ్ తదితరులు పాల్గొన్నారు.
