రూ.30 లక్షల డొనేషన్ అందజేసిన సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని.
నేటి తెలుగు పత్రిక: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ విరాళం లభించింది. హైదరాబాద్కు చెందిన స్మార్ట్ సాఫ్ట్వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ యలమంచిలి మదన్మోహన్ రావు మంగళవారం టీటీడీకి రూ.30 లక్షలు విరాళంగా అందజేశారు.శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో, దాత టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుతో పాటు ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలని చైర్మన్ను కోరారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యాలు, సేవా కార్యక్రమాల విస్తరణకు ఈ విరాళం ఉపయోగపడనుందని టీటీడీ అధికారులు తెలిపారు.
సింహ వాహనంపై యోగనరసింహుడిగా కల్యాణ వేంకటేశ్వరుడు
భక్తులకు అభయమిచ్చిన స్వామివారు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం ఉదయం భక్తిశ్రద్ధల నడుమ సింహ వాహన సేవ ఘనంగా జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామివారు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.వాహన సేవలో ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తులు చెక్కభజనలు, కోలాటాలు చేస్తూ స్వామివారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తిరసంతో మార్మోగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
సింహ వాహనం ప్రాధాన్యం
సింహం ధైర్యం, పరాక్రమం, తేజస్సుకు ప్రతీక. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారని పురాణోక్తి. ఈ దర్శనంతో భక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, సోమరితనం నశించి విజయం సిద్ధిస్తుందని ఆలయ పండితులు వివరిస్తున్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరుగనుంది. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో వరలక్ష్మి, విజివో గిరిధర్, ఏఈవో గోపినాథ్, ఇతర అధికారులు, అర్చకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
