పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు త్వరగా దర్శనం.. సేవలను మెరుగ్గా అందించేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు అమలుకు సిద్దమైంది. ఇప్పటికే రద్దీ వేళల్లో క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా టీటీడీ ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, పరీక్షలు పూర్తయిన తరువాత వేసవి సెలవుల్లో తిరుమలలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో.. రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు టీటీడీ సమాయత్తం అవుతోంది. ఇదే సమయంలో లడ్డూ విక్రయాల పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ కొత్త నిర్ణయాల అమలుకు సిద్ధం అవుతోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు సులభంగా లడ్డూలు పొందేలా టీటీడీ ఆలోచనలు చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రంలోని ప్రతి కౌంటర్ వద్ద యూపీఐ పేమెంట్కు అవకాశం కల్పించనుంది. ఏటా లడ్డూల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. కౌంటర్ వద్ద భక్తులు నగదు చెల్లించి లడ్డూలు పొందుతున్నారు. శ్రీవారి ఆల యం వెనుకభాగంలోని లడ్డూ విక్రయ కేంద్రంలో గతేడాది కియోస్క్ యంత్రాలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల యూపీఐ పేమెంట్లు చేసే వారి సంఖ్య పెరిగిన క్రమంలో ఈ నూతన యంత్రాలను అందుబాటులో ఉంచింది. కావాల్సిన లడ్డూల సంఖ్య ఎంపిక చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే వచ్చే రశీదు ఆధారంగా కౌంటర్లో లడ్డూలు పొందవచ్చు. అయితే, ఈ యంత్రాల వద్ద ఇటీవల రద్దీ అధికం కావడం, యంత్రాల్లో సాంకేతిక ఇబ్బందులు, మళ్లీ లడ్డూల కోసం కౌంటర్ క్యూలైన్లలో నిలబడడం తదితర కారణాల నేపథ్యంలో కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీని ద్వారా ఇక నుంచి భక్తులకు కియోస్క్ యంత్రాల ముందు నిలబడే అవసరం ఉండదని, నేరుగా కౌంటర్లోనే లడ్డూలు పొందేలా వెసులుబాటు కలగనుంది. తాజా ప్రతిపాదనల మేరకు ఈ సర్వీసును ఇచ్చేందుకు ఓ బ్యాంక్ కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. తొలుత ఎంపిక చేసిన కొన్ని కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేసి వచ్చే ఫలితాలను బట్టి అన్ని సెంటర్ల వద్ద ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా దర్శనం.. వసతి.. లడ్డూ ప్రసాదం పైన శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. వారి నుంచి వచ్చిన సూచనలు.. సలహాలకు అనుగుణంగా మార్పులకు సిద్ధం అవుతున్నారు. క్యూ లైన్లలో ఎక్కువ సేపు భక్తులు వేచి ఉండే అవసరం తగ్గించే విధంగా చర్యలు చేపడుతున్నారు. సాధారణ భక్తులకు దర్శనంలో ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఏఐ వినియోగం పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. దీని ద్వారా మరింత వేగంగా భక్తులకు దర్శనం అందుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు
