పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాల నిరసన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన కడప నగరంలో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పులివెందుల అధ్యక్షులు రామాంజనేయులు, పులివెందుల ఏరియా కార్యదర్శి బ్రహ్మంలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, యజమానులకు విపరీత లాభాలు తీసుకొస్తాయని అన్నారు. స్వాతంత్య్రం ముందు నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తోందన్నారు. ఇంతవరకూ అమలవుతున్న కనీస వేతనాల చట్టం, పిఎఫ్, ఇఎస్ఐ, బోనస్, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేశారని తెలిపారు. ఈ 11 ఏళ్ల కాలంలో పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారని దుయ్యబట్టారు. భూములు, గనులను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సమగ్ర చట్టం లేదని, గ్రామీణ ప్రాంతంలో అమలు చేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, స్కీముగా మార్చారని, కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసిపి మద్దతునిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమం లో ఏఐటీయూసీ కోశాధికారి మల్లేష్, భవన నిర్మాణ సంఘం వేంపల్లి మండల కార్యదర్శి బాలాజీ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం సెక్యూరిటీ గార్డ్ యూనియన్ లోకేష్, చిరు వ్యాపారస్తుల సంఘం నాయకులు రామాంజనేయులు భవన నిర్మాణ సంఘం వేంపల్లి ఉపాధ్యక్షులు నాగేశ్వరావు భవన నిర్మాణ సంఘం నాయకులు చలపతి తదితరలు పాల్గొన్నారు.
