మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు.
సూర్యాపేట,నేటి తెలుగు పత్రిక: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు పొట్ట కొట్టేందుకు పార్లమెంటులో తీసుకువచ్చిన వి బి జి రాంజీ బిల్లును రద్దు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి12న ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక లోకం జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబీజేపీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న 10 కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. జిల్లాలోని 23 మండలాలు5 మున్సిపాలిటీలలో ఈ సమ్మె జరుగుతుందని సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని బిజెపి అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేయాలని కోరారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉత్పత్తి చేసిన సంపద శ్రమజీవులకే దక్కాలని, సంపదను వికేంద్రీకరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఆపాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి ప్రతి ఒక్క కార్మికుని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని, అంతవరకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, కార్మికులు ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని, విత్తన విద్యుత్ బిల్లులకు సవరణలు ఆపాలని, తదితర అనేక డిమాండ్లతో ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన గత 12 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ, పేద మధ్య తరగతి, కార్మికులకు వ్యతిరేకమైన విధానాల అనుసరిస్తున్నదని తెలిపారు. కార్మికులకు భద్రత కల్పించకుండా, సంక్షేమాలు అమలు చేయకుండా నిర్బంధ నియంతృత్వ దౌర్జన్యపూరిత విధానాలతో శ్రమ దోపిడిని నిరాటంకంగా కొనసాగించడానికి చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగానే ఈ సమ్మెను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12 నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మె చారిత్రాత్మకమైనదని, ఈ సమ్మెల ప్రతి కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనేక పోరాటాల ద్వారా 2005 సంవత్సరంలో సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి వి బి జి రామ్ జి బిల్లును తీసుకువచ్చారని అన్నారు. ఈ బిల్లులో అనేక మార్పులు చేశారని ఈ మార్పుల మూలంగా ఉపాధి కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు, నాయకులు రణపంగా అశోక్, ములకలపల్లి సైదులు పాల్గొన్నారు.
