కరీంనగర్, ఫిబ్రవరి 11,నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల సరళని పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ నుండి ఎన్నికల తీరును పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు.
- ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లొకేషన్ లో ఉన్న పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఆమె వెంట మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అధికారులు ఉన్నారు.
