కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య బృందానికి సూచించారు.కరీంనగర్ మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లల వార్డును సందర్శించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఇక్కడి సమావేశ మందిరంలో గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ సంఖ్యలో సాధారణ ప్రసవాలు జరగడం విశేషమని అన్నారు. ఆదిలాబాద్ తర్వాత జిల్లాలోని పిహెచ్సిల్లో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు.
అదేవిధంగా మాత శిశు సంరక్షణ కేంద్రంలో డెలివరీల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే సాధ్యమైన మేర సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గర్భిణికి ముందు నుంచే సాధారణ ప్రసవం ఆవశ్యకతను ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. శుక్రవారం సభలకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది హాజరై సాధారణ ప్రసవం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ప్రతి గర్భిణీకి టీఫా స్కాన్ తప్పనిసరి అని తెలిపారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మరొక టీఫా మిషన్ తెప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతా శిశు కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాల జాబితా సమర్పించాలని, వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మరిన్ని పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆర్ఎంవో నవీనా, ప్రోగ్రాం అధికారి సనా, వివిధ విభాగాలకు చెందిన వైద్యాధికారులు పాల్గొన్నారు
