రూ.10,300 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం
మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్
మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి రూరల్ పరిధిలోని అక్షయపాత్ర సమీపంలోని పొలాల్లో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్న గుంపుపై మంగళగిరి గ్రామీణ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.10,300 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని నిందితులను పట్టుకున్నారు. వారిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూదం, పేకాటతో పాటు అన్ని రకాల అక్రమ, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై చిరుమామిళ్ల వెంకట విజ్ఞప్తి చేశారు.
