నాగాయలంక, (కృష్ణా )ఫిబ్రవరి 13, నేటి తెలుగు పత్రిక: గ్రామాలలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పచ్చని మొక్కలు ఎంతో దోహదకారంగా నిలుస్తాయని, అదేవిధంగా చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణ పిలుపునిచ్చారు. నంగేగడ్డ గ్రామ పంచాయతి పరిధిలోని హరిత గ్రామం మరియు ప్రసన్న వధనం పార్కులను సందర్శించి, అక్కడ చేపట్టిన అభివృద్ధి మరియు పారిశుధ్య పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. నాగాయలంక గ్రామ పంచాయతి లోని చెత్త సంపద కేంద్రాలను తనిఖీ చేసి, అక్కడ ఏర్పాటు చేసిన గ్లాస్ కట్టింగ్ యంత్రాన్ని పరిశీలించారు. యంత్రాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
అనంతరం నాగాయలంక మండలం పరిధిలోని అన్ని పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజల నుంచి పంచాయతీలకు రావలసిన పన్ను బకాయివసూళ్లు, పారిశుధ్య నిర్వహణ, ఐ వి ఆర్ ఎస్ ఆధారిత ఇంటింటి చెత్త సేకరణ, స్వచ్ఛ రథం నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.జిల్లాలో పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచిన పంచాయతీ కార్యదర్శులను అరుణ అభినందించారు. రాబోయే నెలలో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ నిర్వహిస్తూ, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వంద శాతం పాజిటివ్ పర్సెప్షన్ సాధించాలని ఆదేశించారు. ఈ లక్ష్య సాధనలో ఎటువంటి నిర్లక్ష్యం ఉపేక్షించడం జరగదని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు.

