మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటిఎంసీ హైస్కూల్లో జాతీయ అంధత్వం మరియు దృష్టిలోపం నియంత్రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరా నగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో అర్హులైన విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. గత ఏడాది నవంబర్లో హైస్కూల్లో 825 మంది విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహించగా, 75 మంది విద్యార్థులకు కంటిచూపు మందగించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు హాజరయ్యారు. డైరెక్టర్స్ విన్నకోట, ఇబ్రహీం చేతుల మీదగా విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యా సంస్థలలో విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహించి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శుభశ్రీ, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ నితీష్, పారా మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ శివరామకృష్ణ, హెచ్ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
