- టపాసులు పేలిన సంఘటనలో గాయపడిన పీఠాధిపతి ఖాజా మొహిద్దీన్
- డ్రగ్స్ పై దండయాత్రలో అపశృతి
ఎ.కొండూరు ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర అవగాహన సైకిల్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామంలోని మెయిన్ సెంటర్ లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ కొత్తూరు సెంటర్ మీదగా పాతూరు చేరుకోగా,కొందరు నాయకులు ఏ ఏ ఎం టి కే దర్బార్,బాబె బొగ్దాద్ షరీఫ్ పీఠాధిపతి, సజ్జదా నషీన్, పీర్జాద సూఫీ మొహమ్మద్ ఖాజా మొహియుద్దీన్ షా తాజ్ ఖాదిరీ బాబాను ఆహ్వానించడంతో, ర్యాలీకి ఘన స్వాగతం పలకడానికి బయటకు వచ్చిన పీఠాధిపతి ఖాజా బాబాకు, పోలీసులు బాణసంచా పేల్చే క్రమంలో శక్తివంతమైన బాంబ్ పేలి బాబా ఎడమ తొడకు బలంగా తగలటంతో ఒంటిమీద ఉన్న బట్టలు సైతం కాలిపోయి తొడకు బలమైన గాయాలయ్యి, తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే కుటుంబ సభ్యులు బాబాను మైలవరం ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. టపాసులు పేలి తొడకు తగలటం వలన పెద్ద ప్రమాదం తప్పిందని, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన పీఠాధిపతి ఖాజా మొహిద్దిన్ ను మైలవరం ఏసిపి వై.ప్రసాదరావు, తిరువూరు సిఐ కె.గిరిబాబు, ఎస్ ఐ గంధం మహా లక్ష్మణుడు, పోలీస్ సిబ్బంది, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి, టిడిపి నాయకులు గ్రామస్తులు,భక్తులు పరామర్శించారు.
