కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: ఉన్నత విద్యలో రాణించే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం బాలికలతో మాట్లాడారు. విద్యార్థినీ,విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత విద్య వారధి వంటిదని,విద్యార్థులకు కీలమైన పదో వార్షిక పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఇందుకు విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పరీక్షల్లో రాణించాలన్నారు. వార్షిక పరీక్షకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అత్యంత కీలకంగా మారిన ఈ కొద్ది రోజులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు అవగాహనతో ప్రణాళికాబద్దంగా చదవాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు. గణితంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశాలు ఎక్కువన్నారు. అయితే చాలా మంది విద్యార్థులు గణి తశాస్త్రమంటేనే బెంబేలెత్తిపోతుంటారని, విద్యార్థులు భయాన్ని వీడి గణితంపై శ్రద్ధ పెట్టాలన్నారు. సూత్రాలతో సాధన చేస్తే గణితంలో ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు పదవ తరగతి పరీక్షల కోసం కష్టపడి చదివాలని ఆయన కోరారు. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తే నగదు రివార్డుతోపాటు బట్టలు అందజేస్తానని హామీ ఇచ్చారు.
