కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: కొత్తపల్లి మండలంలోని డిసిఎంఎస్ చింతకుంట, డీసీఎంఎస్ మల్కాపూర్ ఫర్టిలైజర్ దుకాణాలను, గోదామును కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం, నిల్వల రిజిస్టర్ తనిఖీ చేశారు. ఎరువుల నిల్వ చేసిన గోదామును సందర్శించి ఎరువుల నిల్వలను పరిశీలించారు.
ఈ సందర్భంగా యూరియా తీసుకునేందుకు అక్కడికి వచ్చిన రైతులు రిట్టనేని మల్లయ్య, గులిగెపు బక్కయ్య, సత్యనారాయణ రెడ్డిలతో మాట్లాడారు. యూరియా ఆన్లైన్ ద్వారా తీసుకునేందుకు ఏర్పాటు చేసిన యాప్ విధానం గురించి వారి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. యాప్ లో యూరియా తీసుకునే పద్ధతి బాగుందని, దీనివల్ల వ్యయప్రయాసలు తగ్గాయని వారు తెలిపారు. ఎరువుల కొనుగోలు కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం తప్పిందని రైతులు తెలిపారు. ఈ యాప్ ద్వారా తమకు వీలైన సమయంలో యూరియాను బుక్ చేసుకుని కొనుగోలు చేయడం సులభంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ లేకున్నప్పటికీ దుకాణానికి వస్తే డీలర్ ఆన్లైన్లో నమోదు చేసి అప్పటికప్పుడే ఎరువుల బస్తాలు ఇస్తున్నారని తెలిపారు. డీలర్ కు ఫోన్ చేసి కూడా యూరియా బుక్ చేసుకుంటున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా ఎరువులు అందుతాయని తెలిపారు. భూమి విస్తీర్ణాన్ని బట్టి యాప్ యూరియా కోటాను నిర్ణయిస్తోందని అన్నారు. దీనివల్ల ఎరువుల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా పారదర్శకత పెరిగిందని తెలిపారు.గతంలో యూరియా పంపిణీ సమయంలో ఎదురయ్యే రద్దీ, గందరగోళ, ఒత్తిడి ఈ యాప్ ద్వారా తొలగిపోయిందని వివరించారు. యాప్ ద్వారా క్రమపద్ధతిలో పంపిణీ జరుగుతుండటంతో పని ఒత్తిడి తగ్గిందని డీలర్లు తెలిపారు.కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్క్ ఫెడ్ డిఎం గౌరీ నాగేశ్వరరావు, వ్యవసాయ సహాయ సంచాలకులు రణధీర్, ఏఈఓ రాజేంద్రప్రసాద్, ఎంఏఓ సంతోష్ పాల్గొన్నారు.
