చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి,3ట్రాక్టర్లు స్వాధీనం.
జెసిబి, ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు.
ఎ.కొండూరు ఫిబ్రవరి 26 (నేటి తెలుగు పత్రిక): ఎ.కొండూరు మండలం చీమలపాడు సౌత్ రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి, మూడు ఖాళీ ట్రాక్టర్లను స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసినట్లు ఎ.కొండూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రాపురం పంచాయతీ శివారు కోమటికుంట గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు గురువారం చీమలపాడు దక్షిణ భాగంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో మైలవరం మండలం మొర్సుమల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి సంబంధించిన జెసిబి సహకారంతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండగా, కొందరు వ్యక్తుల సమాచారం మేరకు చీమలపాడు బీట్ ఆఫీసర్ ప్రసాద్ నాయక్, ఎ.కొండూరు బీట్ ఆఫీసర్ షేక్ కరిముల్లా, సిబ్బంది మెరుపుదాడి జరిపి, జెసిబిని, మూడు ఖాళీ ట్రాక్టర్లను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.ట్రాక్టర్ యజమానులు మూడు ట్రాక్టర్ల మట్టిని మాత్రమే తరలించినట్లు గ్రామంలో విచారణ జరిపిన అనంతరం ఫారెస్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యజమానులకు జరిమానా విధించి, జెసిబి ని, ట్రాక్టర్లను అప్పగించనున్నట్లు సెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు.
