పూర్తిస్థాయిలో సాగునీరు అందించి పంట పొలాలను కాపాడాలి.
కోదాడ, మార్చ్18 (నేటి తెలుగు పత్రిక): సాగునీరు అందక చివరి భూముల్లో వానాకాలం వరిపంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం,ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి వంతుల వారీగా నీరు విడుదల చేస్తున్నారని, అయితే ఆ నీరు చివరి ఆయకట్టు వరకు చేరడం లేదని వాపోయారు. మొన్నటి వరకు యూరియా కొరకు అనేక కష్టాలు పడి పంటలు పండిస్తే తీరా పంట చేతికి వచ్చే తరుణంలో ఎండిపోతుంటే దిక్కుతోచడం లేదని రైతులు వాపోయారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకువెళ్లినా తమను పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి తమ పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాల రైతులు జాల శ్రీనివాస్, జాల వెంకన్న, గోపి, తిరపయ్య, ముత్తయ్య, మహేష్, కార్తీక్, సోమయ్య, నగేష్, రాంబాబు, శంకర్, నాగేశ్వరరావు, వేణు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

