మే 15, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతోనే ఇంధన ధరలు పెరిగాయని, దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయని తెలిపారు. అదే ప్రభావం భారత్పై కూడా పడిందని, అందువల్లే ఆయిల్ కంపెనీలు ధరలను సవరించాల్సి వచ్చిందన్నారు.ప్రజలపై భారం మోపాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్ణయాలు తీసుకోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాల నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరల్లో మార్పులు జరుగుతాయని చెప్పారు.అమెరికా, జర్మనీ, జపాన్ వంటి పలు దేశాల్లో కూడా ఇంధన ధరలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. ఈ అంశాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా మలచడం సరికాదని విమర్శించారు. ఇక ఆయిల్ కంపెనీలు లీటర్కు రూ.3కు పైగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచగా, కొత్త ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
